గత కొంత కాలంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ ఆకస్మిక సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఐటీ సోదాల పర్వం కలకలాన్ని రేపింది. తాజాగా భారీ స్థాయి సోదాలను ఐటీ శాఖ చేపట్టింది. ఎక్సెల్ గ్రూపు ఆఫ్ కంపెనీ లక్ష్యంగా బుధవారం 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వాహనాల్లో ఐటీ బృందాలు దాడులకు బయలుదేరాయి. గచ్చిబౌలి లోని ఐకియా షోరూమ్ పక్కన గల ఎక్సెల్ కార్యాలయంతో పాటు బాచుపల్లిలో, ఆరుగురు డైరెక్టర్లు, సీఈఓ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నాయి.
అదే విధంగా ఎక్సెల్ గ్రూపుకి అనుబంధంగా ఉన్న మరో పది కంపెనీల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రబ్బర్ ఇంపోర్ట్ ఎక్స్ పోర్టులో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందుతోంది. సంగారెడ్డిలోని నాలుగు కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగ్ లోని ఆరు చోట్ల, బాచుపల్లి, దుందిగల్ లోని నాలుగు కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. లండన్ నుండి 500 కోట్ల ఫండ్ ఎక్సెల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆ లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
రాజకీయ నాయకులకు సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు జరిపితే ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా వాళ్లు ఆరోపణలు చేయడం జరుగుతుంటుంది. వాస్తవానికి ఆదాయపన్ను శాఖ అధికారులు.. సంస్థలు తమ ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నారా లేదా అన్న అంశంపై పరిశీలన జరిపి వ్యత్యాసాలు గమనిస్తే సోదాలు జరుపుతుంటారు. ఐటి సోదాలకు వెళ్లే ముందుగా అందుకు సంబంధించి పెద్ద కసరత్తు కూడా చేస్తారు. పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాతనే సోదాలు జరుపుతూ ఉంటారు.
చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ