గుంటూరు,ఏప్రిల్ 9: గుంటూరు జిల్లా గురజాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని సాంబశివనర్సింగ్ హోంపై మంగళవారం మధ్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
గురజాల టిడిపి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడైన పులికూరి కాంతారావుకు చెందిన ఆసుపత్రి, ఇంటిపై ఈ దాడులు జరగడం పట్టణంలో చర్చనీయాంశమయ్యింది.
ఆసుపత్రి అధినేత కాంతారావు సరైన పత్రాలు చూపించడంతో అధికారులు వెనుతిరిగినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నందున అక్రమ నగదు నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఐటి సోదాలు జరగడం గమనార్హం.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐటి అధికారులు ఏకపక్షంగా టిడిపి అభ్యర్థులు, వారికి సంబంధించిన వ్యక్తులనే టార్గెట్గా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారంటూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టిడిపి ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.