సిడ్నీ టెస్ట్ లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. 90 బంతులను ఎదుర్కొన్న జడేజా ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 50 పరుగులు చేశాడు. పుజారా ఔటవ్వడంతో బ్యాటింగ్ కు దిగిన జడేజా స్కోరు వేగం పెంచే విషయంలో రిషభ్ పంత్ కు పూర్తి సహకారం అందించాడు. స్ట్రైక్ రొటేట్ చూస్తూ పంత్ కు ఎక్కువ అవకాశం ఇచ్చాడు.
పంత్ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ స్కోరు 570/6. ఈ స్కోరుతో భారత్ ఈ టెస్టులో పరాజయంపాలయ్యే అవకాశం లేని స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా భారత్ ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ సాధించి చరిత్ర సృష్టిస్తుంది. సిడ్నీ పిచ్ మూడో రోజు నుంచి స్పిన్ కు సహకరిస్తుందన్న పిచ్ రిపోర్ట్ ను బట్టి చూస్తే భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కవగా కనిపిస్తున్నాయి.