ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు హిందువుల మనోభావాలు దెబ్బతినే ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా మరోవైపు అనుకోకుండా కొన్ని సంఘటనలు రంగు పులుముకొని దీనికి ఆజ్యం పోసేలా మారుతున్నాయి.
తాజాగా అలాంటిదే, శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారనేది విపక్షాల ప్రచారం. దీనిపై సహజంగానే దుమారం రేగుతోంది.
వచ్చారండి రాజు గారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ముందుండే ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ సంఘటనలోనూ స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్దాలుగా వస్తున్న డిక్లరేషన్ ను సీఎం పాటించకపోవడం సరైంది కాదని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు సైతం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన గుర్తుచేశారు. సీఎం సెక్యులర్ అని భావిస్తున్నానని.. ఇప్పటికైనా అన్యమతస్తుల భావాలను గౌరవిస్తారని నమ్ముతున్నానన్నారు. అలా చేయకపోతే సీఎం జగన్ ఎలా తిరుమల వెంకన్నను దర్శించుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.
చాన్స్ వదులుకోని చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఏపీ సర్కారును ఇరకాటంలో పడేసే చాన్స్ ఏ మాత్రం వదులుకోలేదు. మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని అన్నారు . సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏనాటికి మారని శాశ్వత ధర్మమని.. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండడం దారుణమంటూ ట్వీట్ చేశారు. సనాతన ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవంటూ వ్యాఖ్యానించారు. ఎవరైనా స్వామిపై నమ్మకంతో రావడం కోసమే టీటీడీలో అన్యమతస్తులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
సుబ్బారెడ్డి ఏమంటున్నారంటే…
టీటీడీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు స్పందిస్తున్న తరుణంలో, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి స్పందించారు. డిక్లరేషన్ తీసేయాలని నేను చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి ఆలయం ఎదుట తనను కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన “తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మీద విశ్వాసం, నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ముఖ్యమైన పర్వదినాలలో రోజుకు 80 వేల నుంచి లక్ష మంది కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. వీరిలో వివిధ మతాలకు చెందినవారు ఉంటారు. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే నేను మాట్లాడాను“ అంటూ చెప్పుకొచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా వైఎస్ జగన్ ఇలా
శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాను రాజకీయాల గురించి మాట్లాడటానికి తిరస్కరించానని సుబ్బారెడ్డి అన్నారు. “ప్రతిపక్ష నేత టిటిడికి సంబంధించిన విషయాల మీదే ఆరోపణలు చేసినందువల్ల మీరు వివరణ ఇవ్వాలని మీడియా సోదరులు మరోసారి అడగడంతో నేను ఈ విషయాల గురించి మాట్లాడాను. సోనియా గాంధీ, దివంగత సిఎం డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే నేను చెప్పాను. అందువల్ల ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాను.“ అంటూ చెప్పుకొచ్చారు.
టీటీడీ చట్టం ఏం చెప్తోంది?
టిటిడి చట్టంలోని రూల్ : 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులని సుబ్బారెడ్డి తెలిపారు.“స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతకు తాము డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు“ అని వివరించారు.
జగన్ ఆనాడే ఇలా…
వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నాకే తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. “ పాదయాత్ర ముగిశాక తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవేంకటేశ్వర స్వామి వారి మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని నేను చెప్పలేదని పునరుద్ఘాటిస్తున్నాను.“ అంటూ క్లారిటీ ఇచ్చారు. టీటీడీ ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రజలందరి తరఫున గరుడసేవ రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి శ్రీ వేంకటేశ్వరస్వామివారంటే అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని చెప్పాను. సర్వదర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు, అన్ని వేల మందిలో ఎవరు ఏ మతస్తులో ఎలా గుర్తించగలుగుతామని మాత్రమే చెప్పాను. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.“ అంటూ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.