వైసిపి పార్లమెంట్ సభ్యులు పలువురు సమావేశాలకు హాజరు కాకపోవటం అటుంచి పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా గైర్హాజరు కావడం ముఖ్యమంత్రి ,పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల వ్యవహారం జగన్ కి ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తోంది.వీరంతా ఏమయ్యారు ఎక్కడున్నారో ఎందుకు చురుగ్గా లేరు తదితర అంశాలపై జగన్ ఆరా తీస్తున్నారట .అత్యంత కీలకమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన గళాన్ని బలంగా వినిపించాలని సీఎం జగన్.. తన పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ సూచించారు. పేరు పేరునా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా.. పోలవరం పెండింగు నిధులు – మండలి రద్దు – జీఎస్టీ బకాయిలు – వెనుక బడిన జిల్లాల అభివృద్ది నిధులు -ప్రత్యేక హోదా.. వంటి ముఖ్యమైన అంశాలపై పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి..
సాధించేలా ప్రయత్నం చేయాలని.. ప్రతి ఒక్కరూ మాట్లాడాలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు.కానీ జగన్ ఆదేశాలను కొంతమంది ఎంపీలు బేఖాతరు చేస్తున్నారు.రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అవసరమైతే పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలుపవలసిందిగా జగన్ ఆదేశించగా అలాంటి కార్యక్రమాలను వైసీపీ నిర్వహిస్తూ వస్తోంది.అయితే ఇటీవల నిర్వహించిన ఒక ఆందోళన కార్యక్రమానికి ఏకంగా ఎనిమిది మంది ఎంపీలు డుమా కొట్టారు.మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వైసీపీ పక్షాన ఇరవై రెండు మంది లోక్సభ కి ఎన్నికయ్యారు.వారిలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించారు.రఘురామకృష్ణం రాజు రెబల్గా మారిపోవడంతో ఇరవై మంది ఎంపీలు ఉన్నారనుకుందాం.వీరిలో ముగ్గురు ఎంపీలకు కరోనా సోకింది. మరో ఎంపీ అమెరికాలో ఉండిపోయారు.
లోక్సభ ఎంపీలు ఇలా పదహారు మంది ఉండగా రాజ్యసభకు ఎన్నికైన వారు మరో ఆరుగురున్నారు.మొత్తంగా చూసుకుంటే ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు వైసిపికి ఉండగా ఇటీవల పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేవలం 14మంది పాల్గొన్నారు.ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో జగన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారని,ఆ ఎనిమిది మంది అజా పాజా కనుక్కోవలసింది గా ఆదేశించారని వైసిపి ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయి.వీరు మామూలుగానే సమావేశాలకి గైర్హాజరయ్యారా లేక బీజేపీతో టచ్లో ఉండి ఏవైనా తెరవెనుక వ్యవహారాలు సాగిస్తున్నారా అనే విషయమై పార్టీ వేగులు సమాచారం సేకరిస్తున్నారని,ఇప్పటికే … మిథున్ రెడ్డి , విజయసాయిరెడ్డిలకు జగన్ క్లాసు పీకారని ఆ వర్గాలు చెప్పాయి.మొత్తం మీద ఎనిమిది మంది ఎంపీల వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది.