అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు.
రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య జగన్, భారతి దంపతులు గృహ ప్రవేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్కుమార్లతో పాటు వైసిపి నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఇంటి ఆవరణలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని వైసిపి ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల సమక్షంలో జగన్మోహనరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా నిన్నటి వరకూ హైదరాబాదు లోటస్ పాండ్ నివాసం నుండే వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్న తలంపుతో జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంతంలోనే శాశ్వత గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేశారు.
జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని రాయలసీమకు తరలిపోతుందని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా జగన్ ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
రాజధాని విషయంపై ఆ పార్టీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే ఉంటుందని ఉమారెడ్డి స్పష్టం చేశారు.
కుటుంబ సమేతంగా నూతన నివాస గృహప్రవేశం, కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రీ వైయస్ జగన్#YSJagan #YSRCP pic.twitter.com/GAvN7FDrnH
— YSR Congress Party (@YSRCParty) February 27, 2019