తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెడులపల్లిలో అధికార పార్టీ నాయకుడి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే! ఈ విషయంపై దళిత సంఘాల సంగతి కాసేపు పక్కనపెడితే.. అన్ని వర్గాల నుంచీ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదనే డిమాడ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితా రాణి, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ, రాజమండ్రిలో బాలికపై అత్యాచారం… ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కేంద్రంగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో ఈ విషయంపై స్పందించిన సవాంగ్… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. అందుకోసం పూర్తి విచారణకి ఆదేశించాం.. ఇటువంటి ఘటనలను ఉపేక్షించబోమని తెలిపారు. ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పే ఉద్దేశంలో భాగంగా… ఆ యువకుడికి శిరోముండనం చేసినందుకుగానూ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లును సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు.
కాగా… ఇసుక లారీలను అడ్డుకుంటున్నారు అనే కారణంతో స్థానిక వైసీపీ నాయకుని అనుచరుడు ఫిర్యాదు మేరకు ఈ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. యువకుడిని చితకబాది, అనంతరం శిరోముండనం చేశారు! ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.