విశాఖపట్నంలో ఉన్న నలుగురు టిడిపి ఎమ్మెల్యేల్లో ఒక్క వెలగపూడి రామకృష్ణబాబుని మినహాయిస్తే మిగిలిన ముగ్గురు వైసిపిలోకి వెళ్లిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకుల అంచనా.
ఇప్పటికే వాసుపల్లి గణేష్ బాబు ఫ్యాను గాలిలో సేద దీరుతున్నారు. ఇక మిగిలిపోయింది గంటా శ్రీనివాసరావు, గణబాబులు మాత్రమే ..వీరిద్దరూ గురుశిష్యులు ..గతంలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్లొచ్చిన వారే.గణబాబును తీసుకుని గంటా శ్రీనివాసరావు వస్తారన్నది జగన్ అంచనా.అందుకు వీలుగా వైసిపి ద్వారాలను జగనే తెరిచి పెట్టారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.గణబాబు ఇప్పటికే టిడిపి అధినాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారట.తన నియోజకవర్గంలో గ్యాస్ లీక్ అయి పదిహేను మంది చనిపోతే బాబు కానీ లోకేష్ కానీ రాకపోవడం పట్ల గణబాబు మండిపడుతున్నారు.
ఆయన అపుడే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో విశాఖకు రాజధాని కావాలన్న డిమాండ్తో గణబాబు వైసిపికి మద్దతు ప్రకటిస్తారని తెలుస్తోంది . వీలైతే తన గురువు గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన వైసిపిలోకి రాగలరని తెలుస్తోంది. కానీ గంటా విషయంలో ఇప్పటికీ విజయసాయిరెడ్డి కోపంగానే ఉన్నారని టాక్. తనకూ జగన్ కి మధ్య చిచ్చు పెట్టేలా గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ప్లాన్ వేశారన్నది సాయిరెడ్డి ఆగ్రహం. అందుకే ఆయన తెలివిగా గంటా వెనక ఉన్న వారిని ఒక్కొక్కరిగా వెంటబెట్టుకుని మరీ జగన్ చేత కండువాలు కప్పిస్తున్నారు. అలా గంటా శ్రీనివాసరావు బలం లాగేశారు.
ఇపుడు గంటా వైసీపీలోకి వస్తే వీరంతా మళ్లీ ఆయన వెనక నిలబడతారు కాబట్టి ఆయన పార్టీలో స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశ్యంతో సాయిరెడ్డి ఎప్పటికీ రానివ్వరు అంటున్నారు.కానీ జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని గంటాను పార్టీలోకి చేర్చుకుంటే టిడిపి విశాఖలో పూర్తిగా నిర్వీర్యం అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.పైగా ఒక కాపు సామాజిక వర్గ టిడిపి ఎమ్మెల్యేను లాగేయాలన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది.ఎవరెన్ని చెప్పినా గంటా పట్ల జగన్ సానుకూలంగానే ఉన్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.వీరిద్దరూ వచ్చేశాక వెలగపూడి రామకృష్ణబాబుకి కూడా మంత్రి బొత్సా సత్యన్నారాయణ ద్వారా గాలమేసి లాగేయాలన్న పధక రచనలో వైసీపీ ఉందంటున్నారు. మరి ఈ వలసలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎలా అడ్డుకుంటారో వేచి చూద్దాం!