తిరుపతి, పిబ్రవరి 6: ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కాపీరాయుడు అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వైసిపి ప్రకటించిన నవరత్న పథకాలు కాపీ కొడుతున్నారని రాష్ట్రంలోని ప్రజలు అందరికి అర్థం అయ్యిందని అన్నారు. తిరుపతిలో బుధవారం ప్రారంభించిన సమర శంఖారావంలో జగన్ ప్రసంగించారు.
1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టి రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఖంగుతున్న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు కేజీ బియ్యం రూ.1.90పైసలకు అందించారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోని ఆయన ఎన్నికలకు ముందు రూపాయి 90పైసలకు బియ్యం ఇచ్చినా ప్రజలు నమ్మి ఓట్లు వేయలేదనీ, ఎన్టిఆర్కే బ్రహ్మరథం పట్టిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసేందుకు పథకాలు పెట్టినంత మాత్రాన ఆ పెద్ద మనిషిని ఇక ప్రజలు నమ్మరని జగన్ అన్నారు.
మూడు నెలల తరువాత ప్రజల ఆశీర్వాదంతో ఎవరు సిఎం అవుతారో
ఆ భగవంతుడికే తెలుసు, కానీ ఈ ముఖ్యమంత్రి కలలు కంటూ ఇప్పటి నుండే వాగ్దానాలు చేస్తూ కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని జగన్ విమర్శించారు.
ఇప్పటి వరకూ ఈ పెద్ద మనిషి మోసాలు చేస్తూ ప్రజలకు సినిమాలు చూపిస్తున్నాడని జగన్ అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో లూటి చేసిన డబ్బులను బిస్కెట్ల మాదిరిగా పంపిణీ చేసి ఓట్లు పొందాలని తాపత్రయపడుతున్నారని జగన్ విమర్శించారు.
బూత్ కమిటీ సభ్యులు అందరూ గ్రామాల్లో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈ శంఖారావంకు వచ్చిన వారిని చూస్తుంటే కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంలా ఉందని జగన్ అన్నారు.
బూత్ కమిటీలకు దిశా నిర్ధేశం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి తన వెంట నడిచారు, చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారని అన్నారు.
‘మీకు తగిలిన ప్రతిగాయం నా గుండెకు తగిలినట్లే, మీ అందరి బాగోగులు నేను చూసుకుంటా, అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటా, రాజకీయంగా, సామాజికంగా ఆదుకుంటా, చాలా గర్వంగా చెబుతున్నా, మీరందరూ నా కుటుంబ సభ్యులు’ అని జగన్ అన్నారు.
రాష్ట్రంలోని ఎల్లో మీడియా లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ఆ ఛానల్స్లో, పేపర్లలో చూపిస్తుంటారు, మన పోరాటం ఈ అధికార పార్టీతో పాటు వారిపైనా పోరాటం చేయాల్సి ఉంటుందని జగన్ అన్నారు.
ఎన్ని మోసాలు, రాజకీయాలు చేసినా ప్రజలు స్థిరంగా ఉన్నారని, రాబోయేది మన ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని జగన్ భరోసా ఇచ్చారు. తొలుత ‘అన్న పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా తటస్తులతో సమావేశమయ్యారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించారు.
‘మీ అందరి బాగోగులు నేను చూసుకుంటా, మన ప్రభుత్వం కోసం సవ్యసాచులై పని చేయాలని’ జగన్ పిలుపునిచ్చారు.