విజయవాడ, జనవరి 18: వైఎస్ జగన్పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును పటిష్ట పోలీసు భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎన్ఐఎ అధికారులు నిందితుడిని ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. కేసు విచారణ సమయంలో మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలన్న శ్రీనివాసరావు వినతిని న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ పూర్తి అయ్యే వరకూ మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం కుదరదన్నారు. 25వ తేదీ వరకూ రిమాండ్ విధించారు.
విజయవాడ జైలులో భద్రత లేదని, ప్రాణహాని ఉందని శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి విన్నవించారు.
వారి వాదనలను అంగీకరించిన ఎన్ఐఎ కోర్టు గట్టి భద్రత మధ్య నిందితుడిని రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది.
సిట్ అధికారులపై ఎన్ఐఎ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు. సిట్ అధికారులు తమకు సహకరించడం లేదని, కేసు ఆధారాలు ఇవ్వడం లేదని ఎన్ఐఎ అధికారులు ఆ పిటిషన్లో ఆరోపించారు.