కీలక సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరిన సీఎం జగన్ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిషాతో సమావేశం అయిన వైఎస్ జగన్ వీరితో పాటుగా పలువురు బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, ప్రతిపక్షాల దూకుడుగా వెళ్తున్న తరుణంలో వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ఢిల్లీ టూర్…ఎన్ని లెక్కలంటే….
ప్రస్తుతం రాజకీయ పరిణామాలు హీటెక్కిన వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్లో అనేక అంశాలు భాగం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రాజధాని భూముల అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు.. ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం జగన్ సమవేశమయ్యే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ, కోవిడ్ 19 తదితర అంశాలపై వివరించే అవకాశముంది. పోలవరం, ఉపాధి హామీ నిధులు పెండింగ్ నిధుల విడుదలపై వారితో చర్చించనున్నారని సమాచారం.
అమిత్షాతో సమావేశంతో హీట్…
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇటీవలే ఆయన కరోన నుంచి కోలుకున్న నేపధ్యంలో అమిత్ షా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పెండింగ్ అంశాలపై అమిత్ షా కు ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞాపన పత్రం అందచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానుల ఏర్పాటు,పెండింగ్ నిధుల విడుదల గురించి ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. అతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు, అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అంశాలను అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో పాటుగా ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి వివరణ ఇచ్చారని సమాచారం.
టెన్షన్లో బాబు టీం?
కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైసీపీ అధినేత ఢిల్లీ టూరుతో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అవినీతి సహా ఇతర అవినీతి పర్వంపై విచారణ జరుగుతుందేమోనని సైకిల్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.