ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక నేతల్లో ఒకరు, టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వల్లభనేని వంశీ గత కొద్దికాలంగా ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చి అధికార వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల్లో మొదటి వ్యక్తి. అప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు ఇస్తున్న యువ నేత. అయితే, తాజాగా ఆయనకు సొంత నియోజకవర్గంలోనే షాకులు తలుగుతున్నాయి.
అక్కడ అసలు రాజకీయం ఏంటో తెలుసా?
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఆసక్తికర రాజకీయానికి మారుపేరు. వైసీపీ ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులు పార్టీ కోసం శ్రమించారు. అయితే, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరడంతో రాజకీయం మారింది. ఆయనతో కలిసి పని చేసేందుకు సీనియర్ వైసీపీ నేతలు సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి తనతో పాటు ఉన్న వారితోనే వంశీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు సత్తా కొనసాగించేందుకు వంశీ స్వయంగా ఎంట్రీ ఇచ్చి తానే వైసీపీ ఇంచార్జీనని ప్రకటించనుకున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు.
ఏం మాటలవి వంశీ?
వల్లభనేని వంశీ గన్నవరం రాజకీయాల గురించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వంశీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జినని చెప్పడమే కాకుండా ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం చర్చకు తెరలేపింది.
రచ్చ రచ్చ….
గన్నవరంలో తాజాగా రచ్చ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఏకంగా రాళ్లు రువ్వుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు సమచారాం. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. తరచుగా వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న పరిణామంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? జిల్లా మంత్రులు, ఇంచార్జ్లు ఎలా సర్దిచెబుతారో..? వేచి చూడాలని అంటున్నారు.
జగన్ ఎంట్రీ ఇవ్వాల్సిందే.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?