మంత్రి జయరాం కుమారుడు ఈఏస్ఐ కేసులో ఏ 14గా ఉన్న కార్తీక్ నుండి బెంజ్ కారు బహుమతి తీసుకున్నాడు అనే వివాదం మంత్రి చుట్టూ బిగుస్తోంది. జగన్ కు తలనొప్పి వ్యవహరంగా కూడా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండి అవినీతిని సహించబోననీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనీ పిలుపునిచ్చిన జగన్మోహనరెడ్డికి తన కేబినెట్ లోని మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, దానికి సాక్షాలు కూడా బయటకు వస్తుండటంతో చిక్కులు తప్పడం లేదు. ఈ వివాదంపై మంత్రి జయరాం ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో వైసీపీలో కూడా కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది.
ఆరోపణలు బలపెడుతున్న టీడీపీ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాంను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ టీయూసి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడిని రక్షించేందుకు అచ్చెన్నాయుడిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారనీ టీ ఎన్ టీ యు సీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం మంత్రి జయరాం కుమారుడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
మరో పక్క కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ..మంత్రి జయరాంకు సవాల్ విసిరారు. కార్మిక మంత్రి జయరాం అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తాం.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మేరకు ప్రత్రికా ప్రకటన విడుదల చేస్తూ మంత్రి జయరాంకు సంబంధించి అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొన్న పేకాట, నిన్న భూముల కొనుగోలు, తాజాగా బెంజ్ కారు ఇలా రోజుకు ఒక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే జయరాంను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసి ఏసిబి లేదా సిబి సిఐడీ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తును జరిపించాలని డిమాండ్ చేశారు సుజాతమ్మ. ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14గా ఉన్న తెలుకపల్లి కార్తీక్ పేరుపై ఉన్న బెంజ్ కారును మంత్రి కుమారుడు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని తిరిగింది నిజమా కాదా సమాధానం చెప్పాలని మంత్రి జయరాంను కోరారు. అక్రమ వ్యవహారాలపై తాము హైకోర్టులో పిల్ కూడా వేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ పేర్కొన్నారు.