ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంటే, అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలే తెగ ఇబ్బంది పెడుతున్నారా?
విపక్ష పార్టీల విమర్శలు తట్టుకోవడం కంటే, సొంత పార్టీ నేతలు చేస్తున్న పనుల వల్లే సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్గా మారింది. కొందరు నేతలు, ఇంకా చెప్పాలంటే పలువురు మంత్రులు చేస్తున్న చర్యలకు ఏపీ సీఎం జగన్ను పరేషాన్ చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ముగ్గురు మంత్రుల తీరు సమస్యగా మారిందని చెప్తున్నారు.
ఆ ముగ్గురు మంత్రుల దారే వేరు
ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మంత్రుల వ్యవహారశైలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడడ్ఇ ఇరకాంటలో పడేస్తోందని టాక్ వస్తోంది. పార్టీకి చెందిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తమ తమ దారుల్లో నడుచుకుంటూ ప్రభుత్వాన్ని మాత్రం పరేషాన్ చేస్తున్నారని అంటున్నారు. వీరిలో ఓ ముఖ్యమంత్రి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారట. ముఖ్యంగా హిందూ మతం విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు ఓ రేంజ్లో పార్టీని ఉక్కిరిబిక్కి చేస్తున్నాయని అంటున్నారు. మరో మంత్రి అవినీతి పర్వం సైతం ఏపీ సీఎం జగన్కు కక్కలేక మింగలేక అనే పరిస్థితి తెచ్చిందని చెప్పుకొస్తున్నారు. ఇంకో మంత్రి అయితే, సొంత జిల్లా ఎమ్మెల్యేల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారని టాక్ వస్తోంది.
ఈ మంత్రిగారి అవినీతి వ్యవహారం
పార్టీకి చెందిన సీనియర్ నేత, మంత్రి వ్యవహారశైలి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారిందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఓ స్కాంలో వైసీపీ మంత్రి పాత్ర ఉన్నట్లుగా పలు ఉదంతాలు బయటకు రావడం, సదరు మంత్రిపై టీడీపీ వరుసపెట్టి ఆరోపణలు చేస్తుంటే.. తిప్పి కొట్టడానికి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ మాట మాత్రంగానైనా స్పందించలేదు. సహజంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే.. అలా చేసిన వారిపై ఎదుటిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. టీడీపీ నేతలు అయ్యన్న, లోకేష్, బుద్దా వెంకన్నలు ఈ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నా తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ మాట్లాడకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కనీసం సొంత జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మంత్రికి మద్దతుగా మాట్లాడలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కేవలం మంత్రి నియోజకవర్గంలోని ఓ మండలంలో మాత్రమే నిరసన తెలిపారంటే ఎంత సహాయ నిరాకరణ ఉందో అర్థమవుతోందని చెప్తున్నారు.
ఈ మంత్రి నోట్లో నోరు పెట్టడమా?
గత కొద్దికాలంగా సంచలన, తీవ్ర వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న ఓ మంత్రి గురించి ప్రస్తావించాలంటే వైసీపీ నేతలు వణికిపోతున్నారట. ముందుగా రాజధాని అమరావతి విషయంలో సంచలన వ్యాఖ్యలు, అనంతరం ఇతర పార్టీలను టార్గెట్ చేయడం, గత కొద్దికాలంగా అయితే, హిందూ మత ఆచారాల విషయంలో ఆయన దూకుడు పార్టీకి మేలు చేసే కంటే కీడు చేయడమే ఎక్కువగా ఉందని వాపోతున్నారుట. ఈ మంత్రి విషయంలో వ్యాఖ్యలను ఖండిస్తే ఒక బాధ, మద్దతిస్తే మరో బాధ అన్నట్లుగా పార్టీ నేతలు కిమ్మనకుండా ఉంటున్నారట. అయితే, ఈ అమాత్యుడి మాటలు మాత్రం అధికార పార్టీకి మైనస్ అవుతున్నాయని అంటున్నారు.
ఈ నేత యొక్క తీరే వేరు
మరో మంత్రి గురించి అయితే వైసీపీ నేతలే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని చూస్తున్నారని టాక్. ఈ నేత ఏకంగా పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వకపోతే తనను సంప్రదించవద్దని కూడా కరాఖండీగా చెప్తున్నారట. ఇలాంటి కొందరు నేత తీరు వైసీపీ అధినేత, ఏపీ సీఎంను బుక్ చేస్తున్నాయని పార్టీ అభిమానులు వాపోతున్నారు. అదే సమయంలో సీఎం జగన్ వీరిపట్ల సరిగా స్పందించకపోతే కష్టమని కూడా చెప్తున్నారు.