వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణల కేసుల విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన స్వల్ప వ్యవధిలోనే ఢిల్లీ పర్యటనలు పెట్టుకోవడం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తుండటం చర్చకు తెరతీస్తోంది.
ఇక ప్రతిపక్ష టీడీపీ అయితే, ఈ ఎపిసోడ్ను కొత్తగా విశ్లేషిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, ప్రధానమంత్రిని ఈ మేరకు బ్రతిమాలుతున్నారని అంటూ విమర్శిస్తోంది. అయితే, ఈ ప్రచారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇదేందయ్యా ఇది…
గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తనకు ఎదురైన షాక్కు ఆయన ఆందోళన చేశారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో తాడిపర్తి గనులశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమై ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జేసీ దివాకర్రెడ్డి… తన సోదరుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టారని జేసీ ఆరోపించారు. తన భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయని పేర్కొంటూ తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని.. జీవితం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.
జగన్ గురించి జేసీ ఏమంటున్నారంటే
ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. తన గనుల్లో అధికారుల సోదాలపై జేసీ తనదైన శైలిలో స్పందించారు. ఆ గనులను శోధించడానికి వాహనాల్లో 50 నుంచి 60 మంది వెళ్లారు. వారిని చూసి ఇంతకీ వీళ్లెవరబ్బా..? అని అనుకున్నానని వ్యాఖ్యానించారు. వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమైనా గనులకు వచ్చారా.? అని అనుకున్నానని వ్యాఖ్యానించిన ఆయన.. పోలీసులు.. నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నాను. గనులు సొరంగం లాగా ఉన్నాయి. అందుకే పోలీసులు కూంబింగ్కు వచ్చారని అనుకున్నాను. తనకు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు స్థాయిలో సన్మానం ఉంటుందంటూ ఫైర్ అయ్యారు. నియంతపాలన ఎన్నిరోజులు ఉంటుందో చూస్తామని.. దీనికి ఫలితం అనుభవించక తప్పదని పేరు పెట్టకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ను హెచ్చరించారు జేసీ.
రాజు గారు ఏం తక్కువ తినలేదండి….
ఇక ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఓవైపు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ కేసులు, సోదాలు జరిగినా ఆయన మాత్రం సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు కొనసాగించారు. టీవల సీఎం వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటనలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు కలసినప్పుడు, తన మీద ఫిర్యాదు చేయమని ఒత్తిడి తెచ్చారని, అందులో భాగంగానే సీబీఐ సోదాలు చేసిందన్నారు. మానసిక రుగ్మతితో ఈ మధ్యన ప్రభుత్వాలను నడిపిస్తున్న వారు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.. దీనికి సంబంధించిన మందులు కొంతమంది వాడుతున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. సీఎం అనుమతిస్తే వారి సమాచారం ఇస్తా.. అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అర్హతలేదని.. రాజ్యాంగం ప్రకారం వారు పదవులలో కొనసాగడానికి వీలులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని కొత్త కామెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి మేరకు తనకు ఎంపీ సీటు ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. వాల్మీకే మహర్షిగా మారినప్పుడు మా రెడ్డిగారు మారకపోతారా అనే ఆశతో పార్టీలో చేరానని.. దురదృష్టవశాత్తు ఆ మార్పు కనబడలేదన్నారు.
పోరాటం ఆగదు….
తిరుపతి ఏడుకొండలు ఏడు రెడ్ల పరం అయ్యాయని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ముఖ్యమైన పదవులు ఒకే సామాజిక వర్గం పరమయ్యాయని ఆరోపించారు. యాదవ సామాజిక వర్గానికి ఒక్క ముఖ్యమైన పదవి ఇవ్వలేదని విమర్శించిన రఘురామకృష్ణంరాజు.. కార్పోరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని. వైసీపీ సర్కార్ తప్పిదాలను ఎత్తి చూపుతానని ప్రకటించారు.
సోషల్ మీడియాలో జోకులు…
ఈ ఇద్దరు ఒకేరోజు చేసిన కామెంట్లపై సోషల్ మీడయిఆలో కొందరు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు చేసిన కామెంట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వణికిపోతారని వాళ్లు అనుకుంటున్నారేమో కానీ ప్రజలకు జగన్ ధైర్యం గురించి, చర్యల గురించి క్లారిటీ ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో కొందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ ఇద్దరి పనులు ఉపయోగపడతాయని సెటైర్లు వేస్తున్నారు.