ఉత్తరాంధ్ర కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడి నుంచే షాక్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు భావిస్తున్నారా?
ఇందుకోసం కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు పేరు ఖరారైనట్లు ప్రచారం చేయడం వెనుక ఇదే కారణమని అంటున్నారు.
ఎర్రన్నాయుడు నీడలో….
తెలుగుదేశం పార్టీ కీలక నేత దివంగత ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు. అన్న ప్రోత్సాహంతోనే అచ్చెన్న రాజకీయాల్లోకి ప్రవేశించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు. హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం రద్దు కావడంతో టెక్కలికి మారారు. టెక్కలి నుంచి రెండుసార్లు ఓడినా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్న మంత్రిగా కూడా పని చేశారు.
అచ్చెన్నాయుడు అనుభవంతో
సుదీర్ఘ రాజకీయ అనుభవం అచ్చెన్నాయుడు సొంతం. అసెంబ్లీలో టీడీఎల్పీ ఉప నేతగా అచ్చెన్నాయుడు అధికార వైసీపీని ఢీకొంటున్నారు. మిగతా ఎమ్మెల్యేల కంటే అచ్చెన్న ఈ విషయంలో ముందుంటున్నారు. తద్వారా ఆయన వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఇటీవల ఆయన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టు కూడా అయ్యారు. దీంతో పార్టీ కోసం ఎంతకైనా వెనకాడకుండా శ్రమిస్తున్న అచ్చెన్నాయుడుకు ఈ పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహించాలని చంద్రబాబు భావించారు. అందుకే ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 27వ తేదీన చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
జగన్కు అక్కడి నుంచే షాక్
ఉత్తరాంధ్రలో బలపడాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు డిసైడ్ అయింది. ఈ మేరకు బలంగా ముందుకు సాగుతోంది. ఉత్తరాంధ్రలో టీడీపీ మూలాలను దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.