నీటి పారుదల శాఖపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఆ క్రమంలో పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ –2 పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్టణానికి తీపికబురు అందించారు.
పనుల్లో జాప్యం వద్దు…
పోలవరం, వెలిగొండ, అవుకు ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్కు తెలియజేశారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని వారు తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అంతే కాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్ (అప్లెక్స్ లెవల్)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు….
ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన భూసేకర ణ, ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అవుకు టన్నెల్ –2 పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు వివరించారు. అవుకు మూడో టన్నెల్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా… సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
రాయలసీమపై కీలక నిర్ణయం
రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. దానికి అంగీకారం తెలిపిన సీఎం… ఆ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసిన విషయాన్ని తెలపగా… ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు నింపగలిగామని అన్నారు. అదే విధంగా గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు.. గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వచేయగలిగామని అధికారులు తెలపగా… 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు.