తెలంగాణలో ఇప్పుడు అంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీలన్నీ ఈ ఎన్నికపై దృష్టి పెట్టాయి.
ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పీఠాన్ని తిరిగి తమ సొంతం చేసుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ప్రభుత్వం రూపంలో కేసీఆర్ సర్కారుకు షాకిచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఏంటి ఈ వివాదం?
గత కొద్దికాలంగా తెలంగాణ – ఏపీ మధ్య నీటి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇటీవల ఈ సమస్య సద్దుమణిగినట్లు పరిణామాలు జరిగాయి. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకొనేందుకు వీలుగా శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్ నుంచి నీటి వినియోగం ఆపాలని కృష్ణాబోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు లెటర్ రాశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేకున్నా.. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్లాంట్లో కరెంట్ ఉత్పత్తి చేస్తూ, సాగర్కు నీటిని విడుదల చేస్తోందని కంప్లైంట్ చేశారు.
ఏముంది ఆ ఫిర్యాదులో..
ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులో వివిధ కీలక అంశాలు ఉన్నాయి. ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో ఆగిపోయిందని.. ఆరోజున రిజర్వాయర్లో 206.97 టీఎంసీల నీటి నిల్వ ఉండేదని వివరించారు. తెలంగాణ సర్కారు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వాడుతోందని పేర్కొన్నారు. రాయలసీమతో పాటు చెన్నై తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా.. తెలంగాణ పవర్ హౌస్ నుంచి నీటి విడుదల ఆపాలన్నారు. కృష్ణాబోర్డు వెంటనే జోక్యం చేసుకుని కరెంట్ ఉత్పత్తి ఆపేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని కోరారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల్లో బిజీగా ఉంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఇలా మరింత ఇరకాటంలో పడేసే గేమ్ ఆడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి తెలంగాణ కౌంటర్ ఏంటో వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?