అమరావతి : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అదిశగా అడుగులు వేస్తున్నారు. ఆ చర్యలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాత్రికి రాత్రి మరో 535 మద్యం షాపులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తగ్గిన మరో 535 మద్యం షాపులు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా వాటిని 2,965 కు తగ్గించింది. నేటి నుండి మరో 535 షాపులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. దీనితో మద్యం సిండికేట్ వ్యవస్థకు చెక్ పడింది. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం షాపుల నిర్వహణకు చర్యలు తీసుకోవడంతో పాటు 20 శాతం మేరకు షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో 13 శాతం షాపులు తగ్గడంతో, ఏడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లు అయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని సీఎం జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.
ధర పెంపుతో తగ్గిన మద్యం అమ్మకాలు
పేద, మధ్య తరగతి వర్గాలకు మద్యం ధరలు అందుబాటులో లేకుండా చేస్తే మద్యంకు బానిసలుగా మారిన వారు క్రమంగా దానికి దూరం అవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో మద్యం షాపుల పునః ప్రారంభించిన అనంతరం ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం 75 శాతం పెంచింది. మద్యం ధరలను పెంచడంతో రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే మద్యం అమ్మకాలు తగ్గాయి.