(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళా ఖైదీల పట్ల ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సహజంగా మహిళలు నేరాలకు దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావంతోనో, క్షణికావేశంలోనో అనుకోకుండా జరిగే సంఘటనలు వారిని నేరస్తులను చేస్తుంటాయి. ఆ నేరానికి వారు సంవత్సరాల తరబడి జైలు శిక్షను అనుభవిస్తుంటారు. మహిళలు జైలుకు వెళ్లడం వల్ల వారి పిల్లల అలనా పాలనా చూసే వారు లేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. ఈ పరిస్థితులను గమనించిన జగన్ సర్కార్.. మహిళా జీవిత ఖైదీల పట్ల మానవతా దృక్పదంతో ఆలోచన చేసి వారిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం మీడియాకు మహిళా ఖైదీల విడుదలకు సంబందించి వివరాలు వెల్లడించారు. అయిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి సత్ర్పవర్తన కల్గిన మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో 147 మంది మహిళలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారనీ, వీరిలో 55 మందిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి 21 మంది, కడప సెంట్రల్ జైలు నుండి 27మంది, నెల్లూరు జైలు సెంట్రల్ జైలు నుండి అయిదుగురు మహిళా ఖైదీలు విడుదల అవుతున్నారని మంత్రి చెప్పారు.
మరో పక్క మహిళ ఖైదీలలో సత్ర్పవర్తన కల్గించేందుకు జైళ్లలో సంస్కరణలు తీసువచ్చామని చెప్పారు. అందులో భాగంగా మహిళా ఖైదీలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, సారీ పెయింటింగ్, బేకరీ లాంటి వాటిల్లో శిక్షణలు ఇస్తున్నట్లు మంత్రి సుచరిత తెలిపారు.