ఏపీలో జగన్ పాలనపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. కొన్ని విషయాల్లో అదేస్థాయిలో విమర్శలూ వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ వ్యవహారం గురించి. ఆ వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపింది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దల ఇన్ వాల్వ్ మెంట్ కూడా ఎక్కువైపోవడంతో అది పూర్తిగా ప్రభుత్వం మెడకే చుట్టుకుంది. అధికారుల మధ్య ముగియాల్సిన విషయం కాస్తా సీబీఐ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో మరో డాక్టర్.. అనితా రాణి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంలో జగన్ తప్పటడుగు వేయడం లేదని తెలుస్తుంది.
సుధాకర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం.. జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావడం తెలిసిందే. భారత మెడికల్ అసోసియేషన్ సైతం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై అసహనం వ్యక్తం చేసింది. ఇక ప్రతిపక్షాల సంగతంటారా… వారికి ఫుల్ మీల్స్ దొరికినంత పని జరిగింది. ఈ క్రమంలో డాక్టర్ అనితా రాణి వ్యవహారం చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై హైకోర్ట్ కి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మిగిలిన వారికి వదిలేసి, సమస్యను పెద్దదిగా చేయాలని భావించని జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. ఆమె వ్యవహారాన్ని వెంటనే సిఐడీ కి అప్పగిస్తూ ఆదేశాలు జారిచేశారు. ఇదే క్రమంలో ఆమె విషయంలో జోక్యం చేసుకోవద్దని మంత్రికి కూడా చెప్పారు.
దీంతో… డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ రిపీట్ కాకుండా జగన్ జాగ్రత్త పడ్డారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈపనే సుధాకర్ విషయంలో కూడా జగన్.. అనితా రాణి విషయంలా కాస్త ముందుగా, వ్యూహాత్మకంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… తనకు రాష్ట్ర అధికారుల మీద నమ్మకం లేదని, సుధాకర్ వ్యవహారం తరహాలోనే తన వ్యవహారాన్ని కూడా సిబిఐ కి అప్పగించాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో జగన్ తీసుకున్న జాగ్రత్తలు ఎంతవరకూ ఈ సమస్యనుంచి బయట పడేస్తాయనేది వేచి చూడాలి!