కేసీఆర్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యారో లేక ముందునుంచీ ఆ ఆలోచన ఉందో ఏమో తెలియదు కానీ… ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతవరకూ బాగానే ఉంది కానీ… కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రతీ చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోనిపక్షంలో.. కొత్త సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. భౌగోళికంగా లోక్ సభ కేంద్రం కంటే జిల్లా కేంద్రాలు దగ్గరగా మారడం వంటి సంఘటనలు జరుగుతాయని అంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఇప్పుడున్న జిల్లా కేంద్రాలు 5 – 7 గంటల దూరం ప్రయాణించాల్సినంత దూరం జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు కొత్త విధానంలో బాపాట్ల జిల్లాలోకి వెళ్లనున్నాయి. కానీ ఈ గ్రామలనుంచి ఇప్పుడున్న ఒంగోలు కంటే బాపట్ల 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా నెల్లూరుకు ఆనుకునే వున్న సర్వేపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే 130 కిలోమీటర్ల దూరంలోని తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో శ్రీకాకుళం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వున్న పాలకొండ నియోజకవర్గం.. అరకు జిల్లా పరిధిలోకి వెళ్తుంది. అంటే… ఇది సుమారు 286 కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రం అవుతుంది.
ఇలాంటివి చాలా జిల్లాలోని గ్రామాలు ఎదుర్కోబోతున్న ఇబ్బందులు అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయం దేశాలు విడిపోయినప్పుడు, రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉండే సమస్యలే అయినప్పటికీ… ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే వివరణ.. తీసుకునే నిర్ణయాల విషయంలోనే.. ఇది ప్రభుత్వానికి ప్లస్సా – మైనస్సా అనే విషయం ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా మొండిగా ముందుకు వెళ్తే మాత్రం ఈ నిర్ణయం ప్రభుత్వానికి కొత్త కష్టాలు తీసుకురావడంతో పాటు, ప్రతిపక్షాలకు ఫుల్ మీల్స్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు!