ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు కళ్లెం వేసేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగాడు. ఊహించని రీతిలో పెరిగిపోతున్న కరోనా వ్యాప్తికి ఏపీ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో తన క్యాంపు ఆఫీసు లో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిలతో సహా పలు కీలక అధికారులు ఈ సమీక్ష కు హాజరయ్యారు.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కట్టుదిట్టమైన చర్యలను ఏపీ ప్రభుత్వం చేపడుతున్నా…. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు అనుక్షణం ఆరోగ్య కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నా కూడా కేసులు ఎలా పెరిగిపోయాయని జగన్ ప్రశ్నించారు. రోజుకు 35 వేల నుండి 45 వేల వరకూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం.. ఇంకా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి సరిహద్దులు పూర్తిగా తెరవడంతో కేసులు ఈ సంఖ్యలో నమోదు అవుతున్నాయని వారు కారణంగా చెప్పారు.
ఇక జగన్ ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 5 నుండి 10 పెంచాలని నిర్ణయించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని.. ఉన్నత వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించి కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆసుపత్రుల ఏర్పాటు విషయంలో రెండు మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఇక కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రుల్లో వీలైనంత త్వరగా వైద్యులు మరియు సిబ్బంది నియామకం చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగిపోయి ఎందుకు మరియు నివారణ పద్ధతులపై విస్తృతంగా అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా హోర్డింగులు ఖచ్చితం అని చెప్పారు. క్వారంటైన్ సెంటర్ల లో నాణ్యత మరియు కాల్ సెంటర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు మరియు వినతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని చెప్పిన ఆయన రానున్న మూడు నాలుగు నెలల పాటు ఇలాగే అప్రమత్తంగా ఉంటూ నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు.