ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ రాజధాని, రాజధాని భూముల అంశం. వాటి కేంద్రంగా జరుగుతున్న వివిధ పరిణామాలు.
అయితే, దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థే దాడికి దిగడం అసాధారణమని, అమరావతి భూముల కుంభకోణం కేసులో న్యాయవ్యవస్థ తీరును రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి తప్పుపట్టారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
విజయసాయిరెడ్డి ఏమన్నారంటే…
నిష్పాక్షికతను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రంపై చేసిన దాడి గురించి గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించడం జరిగిందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెల్లడించిన తాత్కాలిక ఆదేశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారని పేర్కొంది. “అమరావతి భూముల కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ ఇతరులపై సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తూ, ఎఫ్ఐఆర్ వివరాలకు సంబంధించి ఎలాంటి వార్తలు, సమాచారం మీడియా, సోషల్ మీడియాలో ప్రచురణ కాకుండా నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాను ఎందుకు సెన్సార్ చేయాలో పేర్కొంటూ పిటిషనర్ ఎలాంటి రుజువులు, ఆధారాలు చూపకుండా కేవలం పిటిషనర్ ఆరోపణల ఆధారంగా కోర్టు మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పైగా సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అసాధారణంగాను, అత్యంత సందేహాస్పదంగా ఉన్నాయి.“ అంటూ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారని ఈ ప్రకటన వివరించింది.
ఇదేం విడ్డూరం?
న్యాయపరంగా ఈ ఉత్తర్వులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విజయసాయిరెడ్డి అన్నట్లుగా ఈ ప్రకటనలో తెలిపింది. “పిటిషనర్ ఆరోపించినట్లుగా ప్రభుత్వం తమని వేధిస్తునట్లయితే అటువంటి అంశాలకు విస్తృత మీడియా ప్రచారం ద్వారా పిటిషనర్కు మేలు జరుగతుంది. కానీ ఈ కేసులో మీడియాపై ఆంక్షలు విధించాలని పిటిషనర్ కోరడం కోర్టు ఆమేరకు ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు సందేహాస్పదంగా ఉన్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో దీనికి భిన్నంగా అసాధారణ రీతిలో న్యాయవ్యవస్థ మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరంగాను, రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా ఉందని ఆయన ఆన్నారు“ అంటూ పత్రికా ప్రకటన పేర్కొంది.
ఏపీలో న్యాయం ఇలా…
“ఆంధ్రప్రదేశ్లో న్యాయవ్యవస్థ నిష్పాక్షింగా వ్యవహరించడం లేదు. ఒక వైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై విజయవంతంగా పోరాటాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చడానికే న్యాయవ్యవస్థ ఇలా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ప్రబలిపోయింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతాలపై మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ జరగకుండా నిరోధించేందుకు పరోక్షంగా పిటిషనర్లకు సహకరిస్తూ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతోను, పక్షపాత ధోరణితోను న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అటు ఆర్థిక రంగం సృష్టించిన సంక్షోభంతోపాటు ఇటు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు.“ అని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.