రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కు హైకోర్టు నుండి ఎదురు దెబ్బలు తగలడం పరిపాటిగా మారింది. పరిపాలనా విషయంలో తన దైన ముద్రతో ముందుకు సాగుతూ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పాలనా పరమైన విషయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. అయినప్పటికీ గత ఏడాది వరకూ దాదాపు 80కి పైగా ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. పలు కేసుల్లో అయితే హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలూ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులను కోర్టు బోనులో నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి.
హైకోర్టు తప్పుబడుతున్న అంశాల విషయంలో ప్రభుత్వం న్యాయ సమీక్ష చేసుకోకుండా చంద్రబాబు మేనేజ్ మెంట్ వల్లనే హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని ఆరోపణలు చేయడం ప్రారంభించింది. హైకోర్టు తప్పు పట్టిన అంశాలపై సుప్రీం కోర్టుకు వెళుతున్నా ఒకటి రెండు మినహా మిగిలిన అంశాలు అక్కడా వీగిపోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని ప్రచారం చేసి జనాలలో సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఏకంగా న్యాయమూర్తులపైనే దురుద్దేశాలను ఆపాదిస్తూ సూప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు కూడా రాశారు. అనంతర పరిణామాల క్రమంలో దేశ వ్యాప్తంగా పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలో భాగంగా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా బదిలీ అయితే అది తమ ఒత్తిడి వల్లే ఒత్తిడి వల్లే జరిగింది అంటూ ప్రచారం చేసుకుంది. కొత్త న్యాయమూర్తి వచ్చేశారు. ఇక ప్రభుత్వానికి అన్ని సానుకూల తీర్పులే వస్తాయని మాట్లాడుకున్నారు. జడ్జిలుగా ఎవరు ఉన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగం, చట్టపరిధిలో ఉన్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇస్తారే తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా రైట్ రైట్ చెప్పే అవకాశం లేదు.
అందుకే న్యాయమూర్తులు మారినా హైకోర్టు నుండి చట్టాలు, రాజ్యాంగానికి లోబడే తీర్పులు వస్తున్నాయి. తాజాగా రెండు కీలక విషయాల్లో జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ తరువాత వాటిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. తీరా ఈ కేసు న్యాయ సమీక్షలో నిలవలేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం చట్టంలోనే లేదనిీ, క్రిమినల్ కేసు కిందకు రాదని కోర్టు తేల్చేసింది, ఆ కేసులను కొట్టేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉండగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల అంశంపైనా ఎస్ఈసీకి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ తీర్పు వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన పిటిషన్ లపై తీర్పులు ఎలా వచ్చాయో తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు దీనిపై ఉత్కంఠ కొనసాగుతున్నా ప్రభుత్వ నిర్ణయాలను తీసుకునే ముందే మంచి సలహాదారులు, న్యాయనిపుణులతో చర్చించి చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.