గత కొద్దికాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు అన్ని రకాల అవకాశాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రయత్నాల్లో ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు.
అయితే, చంద్రబాబు ప్రయత్నాన్ని ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరావతి క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం వైయస్ జగన్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ ఒక్క మాటతో…
కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు, ఇవేవీ చూడకుండా ఎక్కడా అవినీతి కూడా లేకుండా, వివక్ష అన్నది లేకుండా ఈ 17 నెలల పాలన సాగింది, సాగుతు ఉందని సీఎం జగన్ అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చదువు కోసం, వైద్యం కోసం, ఆరోగ్యం కోసం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని సగర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. “మన తెలుగు రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. దేవతల యజ్ఞానికి రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా?“ అంటూ విపక్షాల విమర్శలను ఒక్క మాటతో కొట్టి పారేశారు.
కులాలు మనల్ని బజారుకు ఈడుస్తున్నాయి
తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు, మన పరువు ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయని సీఎం జగన్ సంచలన కామెంట్లు చేశారు. “వీటిని ఇలాగే వదిలేద్దామా? అన్న ఆలోచన చేయాలి. నా వారు, కాని వారు అన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. ఈరోజు మన కళ్ల ఎదుటనే ఇవి కనిపిస్తున్నాయి. ఈ ధోరణులన్నీ కూడా సమర్థించవచ్చా? అన్న ఆలోచన కూడా చేయాలి. ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్, మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరుపురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా? అన్న ఆలోచన కూడా గట్టిగా చేయాలి“ అని జగన్ పేర్కొన్నారు.
ఆ మీడియా సంస్థలపై
తన వాడు గెలవలేదు, తమ వాడు పదవిలో అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్లు.. ఈ వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? అంటూ సీఎం జగన్ సంచలన కామెంట్లు చేశారు. “సమస్యలు ఉన్నాయి. సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా కర్తవ్యం పవిత్రమైనది. లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమన్న నమ్మకం ఉంది“ అంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు.