ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి , అప్పుడు తీసుకున్న నిర్ణయాలు , వాటి ఫలితాల గురించి వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత పాలనలోని పలు అంశాలను ఉదహరించారు. రాబోయే కాలంలో తీసుకోబోయే నిర్ణయాల గురించి తెలిపారు.
ఇళ్ల పట్టాలకు ఓకే …
డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. డిసెంబరు 25న డి–ఫామ్ ఇస్తూ, ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని తెలిపారు. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుందని, అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతామని ప్రకటించారు.
బాబు గురించి సంచలన వ్యాఖ్యలు
వలంటీర్లు వచ్చే వచ్చే సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వ లెటర్ తీసుకుని పోతారని సీఎం జగన్ చెప్పారు. “మీకు చంద్రబాబు ముద్దా? జగన్ ముద్దా? అని అడుగుతారు. మీకు బాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని కూడా అడుగుతారు. అందులో బాబు స్కీమ్లో ఏముంటుంది? జగన్ స్కీమ్లో ఏముంటుంది? అన్నది స్పష్టంగా రాయండి.“ అని తెలిపారు.
బాబు స్కీమ్ ఇది…
చంద్రబాబు హయాంలోని పథకం గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. “ఆయన స్కీంలో లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా వారికి అందుతుంది. “ అని తెలిపారు. మన ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తుందన్నారు. “ ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్. ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్ కావాలన్నది తెలుసుకోండి.“ అంటూ చంద్రబాబు పాలన గురించి సీఎం జగన్ వివరించారు.
ఏపీలో కరోనా కథ ఏంటంటే…
కోవిడ్–19 గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ హెచ్చరించారు. “రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాము. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 91,54,263 పరీక్షలు చేయగా అందులో 8.54 లక్షల పాజిటివిటీ కేసులు. 9.33 శాతం ప్రతి 10 లక్షల మందిలో 1,71,428 పరీక్షలు జరిగాయి. పాజిటివ్ కేసులు కూడా గత నెలలో తగ్గాయి. కోవిడ్ నివారణ చర్యల్లో జిల్లాల కలెక్టర్లును అభినందించాలి.“ అని అన్నారు.
కరోనా గురించి కీలక వ్యాఖ్యలు
కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని సీఎం జగన్ హెచ్చరించారు. “ యూరప్ మొత్తం కోవిడ్తో వణుకుతోంది. ఢిల్లీలో మరో లాక్డౌన్కు రెడీ. ఫ్రాన్స్, లండన్లో షట్డౌన్. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మహమ్మారి వణికిస్తోంది. అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి, కలెక్టర్లు శ్రద్ద తీసుకోవాలి. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. “ అని స్పష్టం చేశారు.