ఎన్ని విమర్శలు ఎదురైనా , ఎలాంటి ప్రతిఘటన వస్తున్నా తొణకకుండా బెణకకుండా తమ నిర్ణయం తాము తీసుకొని ముందుకు సాగే రాజకీయ నేతలు కొందరు . అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే నాయకులు మరికొందరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన రెండో కేటగిరీలో చేరే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి !
దివీస్ రచ్చ రచ్చ….
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మ పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజా క్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్ తో చర్చలు జరిపింది.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు:
1. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి
2. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.
3. దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్ రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు
4. దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి
5. దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున ‘నైపుణ్య’ సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
6. సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం సానుకూలం
ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయం అందించేందుకు సిద్ధమన్నారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలు , సందేహాల నివృత్తి జరిగే వరకూ ‘దివీస్’ ఒక్క ఇటుక కూడా కదపకూడదని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఫలితమే కంపెనీ దిగిరావడం , ప్రజలకు మేలు జరగడం అని పేర్కొంటున్నారు.