ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మధ్య రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఒకరిని మించిన రాజకీయ తార్కాణం మరొకరు ప్రదర్శిస్తున్నారు.
అయితే, ఈ ఒరవడిలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది చంద్రబాబును కూకటివేళ్లతో పెకిలించే ఎత్తుగడ అని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్ చెప్పిందే చేస్తున్నారా?
మేనిఫెస్టో అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్… అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందే ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడే చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రజలు అధికారం ఇచ్చిన ఐదేళ్ళలో నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని ఎన్నికల ముందు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే మేనిఫెస్టోలో ప్రతి హామీని అమలు చేస్తూ పరిపాలనలో ముందడుగు వేస్తున్నారనే విశ్లేషకుల మాట.
ఇచ్చిన మాట ప్రకారమే…
ఇచ్చిన మాట ప్రకారం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఏలూరులో భారీఎత్తున బీసీ సభ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి బలహీన వర్గాల కోసం, వెనుకబడిన కులాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా, తన తండ్రి దివంగ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల పిల్లలను ఏ విధంగా డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లుగా ఉన్నత చదువులు చదివించారో అంతకన్నా మిన్నగా తాను చదివిస్తానని ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. అందులో భాగంగానే.. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు.
బీసీల తలరాతలు జగన్ మారుస్తున్నారా?
56 కార్పొరేషన్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీల అభ్యున్నతికి పెద్ద ముందడుగు అని సామాజిక విశ్లేషకులు పేర్కొన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదల జీవితాలను మార్చేందుకు పలు కార్యక్రమాలను అమలు చేయగా ఆయన బాటలోనే నడుస్తూ మళ్లీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోనే అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. నాడు వైయస్ఆర్ ఒక అడుగు వేస్తే.. నేడు జగన్ పది అడుగులు ముందుకు వేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా జగన్ ఇలా
బీసీలకు సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వారి రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో అంటే.. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు గానీ, మార్కెట్ యార్డ్ కమిటీలు గానీ, తదితర కార్పొరేషన్ లలో గానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాని ప్రకారం చట్టం చేశారని అంటున్నారు. బీసీల్లో మొత్తం 139 కులాలు ఉంటే.. 56 కులాలకు కార్పొరేషన్లు అవసరమని నిర్థారించి, ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లలను నియమించి, కమిటీలను నియమించి, వారి తాలుక అభిప్రాయాలను, ఆర్థిక అభ్యున్నతికి, వారి విద్యా, సంస్కృతి వ్యవహారలన్నింటిలో కూడా మెరుగుపడే విధంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే తీవ్రంగా బలహీనపడిపోతున్న తెలుగుదేశం పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పుకొస్తున్నారు.