ప్రతి నాయకుడికి మంచీ ఉంటుంది.. చెడూ ఉంటుంది..! మంచిని త్వరగా మర్చిపోయి, చెడుని దీర్ఘకాలం గుర్తుంచుకునేదే లోకం…! అందులోకి రాజకీయ లోకంలో చెడు అనే ముద్ర అసలు రాకూడదు, వ్యక్తిగతంగా కానీ, పాలనాపరంగా కానీ అసలు పడకూడదు. ఇక జగన్.. చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మంచి, చెడులు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మంచి కంటే చెడు మంత్రమే ఎక్కువగా అందరికీ గుర్తుంటుంది. అందుకే అన్నేళ్ల అనుభవం కాస్త పక్కకు వెళ్లి… 20 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేక లాక్కుని, పీక్కుంటున్నారు. ఎంతైనా జగన్ చంద్రబాబుని చూసి నేర్చుకోవాల్సిన అంశం మాత్రం ఒకటి ఉంది. అది నేర్చుకుంటే జగన్ కి ఇక పాలనాపరంగా తిరుగుండదు.
రంగులతో సాధించింది ఏంటి…??
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు కేసులను కాసేపు చెప్పుకుంటే… 65 కేసుల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఏడాదిలోనే ఇన్ని వ్యతిరేక తీర్పులు అంటే జగన్ లాంటి వాడి భవిష్యత్తుపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోకి కొన్ని సిల్లీ కేసుల్లో కూడా గట్టి దెబ్బలు తగిలాయి. ఉదాహరణకి… ఆ రంగుల కేసు చుడండి. “ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు” మొదట వేశారు. కోర్టు వద్దు అనాది. మారుస్తారు అనుకుంటే… మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేసి… మళ్ళీ అదే తరహా తప్పు చేసారు. దీంతో మళ్ళీ హైకోర్టు ఒక చెంప…, సుప్రీం కోర్టు రెండో చెంప పై కొట్టినంత పనయ్యింది. ఇప్పుడు నాలుగు వారాల్లో రంగులు మార్చకుంటే కోర్టు ధిక్కరణ కింద చూస్తామంటూ సుప్రీం హెచ్చరించింది. అంటే జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ పరువుకు భంగం కలిగింది. అసలు ఒక్క నిజాన్ని చెప్పుకుంటే “భవనాలకు వైసిపి రంగులతో జగన్ కి ఒరిగేది ఏముంది..?” ..!! ఒక్క ఓటు అదనంగా పడుతుందా… ఊళ్లలో, జనాల్లో వైసిపి రంగులేమిటో అందరికీ తెలుసు. సో… ఇబ్బంది లేదు. పైగా కళ్లెదుటే రంగులు ఉంటె చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇవన్నీ అర్ధం చేసుకుని రంగుల జోలికి పోకుండా ఉండాల్సింది. కానీ వెళ్లడం, దెబ్బతినడం… మళ్ళీ వెళ్లడం… మళ్ళీ దెబ్బతినడం జరిగిపోయాయి. ఇది జగన్ గ్రాఫ్ కి కాస్త మచ్చలా మారింది. ఆయనపై రంగుల మరక పడింది. అందుకే చంద్రబాబుని చూసి… జగన్ నేర్చుకోవాల్సింది ఏమిటంటే…!
అవే తప్పులు వద్దు…!
చంద్రబాబుకి ప్రచార యావ ఎక్కువ..! విపరీతమైన పబ్లిసిటీ పిచ్చ అందుకే… నెలకోసారి రకరకాల కార్యక్రమాలు పెట్టుకుని… యాడ్లు ఇచ్చుకుంటూ, పర్యటనలు చేసుకుంటూ, అన్నింటిపై తన ఫోటోలు వేసుకుంటూ ఉంటారు. తప్పుల మీద తప్పులు చేసారు. ఎక్కడైనా మీటింగులు జరిగితే ముందస్తు ప్రణాళికతో కొందరికి శిక్షణ ఇచ్చి మాట్లాడిస్తూ… భజన చేయించేవారు. ఇవన్నీ గమనించిన జనాలు, ఓటర్లు బాబు పాలనపై విరక్తితో జనం పక్కన కూర్చేపెట్టారు. దాన్ని చూసి జగన్ నేర్చుకోవాల్సింది. కానీ జగన్ కూడా ప్రచార యావ… ఏడాది పాలన సందర్భంగా అనేక యాడ్లు, కార్యక్రమాలు., పార్టీ రంగులు కార్యాలయాలకు.., సంచులపై తన ఫోటోలు అంటూ చేస్తున్నారు. కార్యక్రమాలు, మీటింగుల్లో కూడా అదే తరహాలో ముందస్తు శిక్షణ ఇచ్చి వేదికలపై మాట్లాడించుకుంటూ.., భజనలు చేయించుకుంటున్నారు. ఇది తనకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా… ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అందుకే జగన్ చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించి… అలా చేయకుండా వాటిని పాఠాలుగా భావించి నేర్చుకోవాల్సి ఉంది. అలా ఉంటేనే జగన్ లక్ష్యం దగ్గరగా చేరుకోగలరు.