ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగింపు, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ తరుణంలో తాజాగా తెరమీదకు వచ్చిన సంచలనం ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం లాజికల్గా ఎదురుదాడి చేస్తోంది.
ఒకే ఒక్క ప్రశ్న
తెలుగుదేశం పార్టీ వివిధ రకాల విమర్శలు, వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఒకే ప్రశ్నతో చెక్ పెట్టేశారు. అమరావతి స్కాంపై సీబీఐ విచారణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధమా.. కాదా.. 24 గంటల్లో చెప్పాలి అని డిమాండ్ చేశారు. “సీబీఐ విచారణ జరిపించండని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు.. అంటే దానర్థం స్కాం జరిగిందనే కదా“ అంటూ లాజిక్ పాయింట్ లాగారు అంబటి రాంబాబు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడమే అతి పెద్ద స్కాం.. ఇందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ అంబటి తేల్చిచెప్పారు.
పాత ప్రేమ పుట్టిందా బాబు?
చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత, ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోయిన నమ్మకాలన్నీమరలా తిరిగి వస్తున్నాయని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. “సీబీఐ మీద చంద్రబాబుకు గతంలో నమ్మకం లేదు. చంద్రబాబు సీబీఐ మీద అనేక వ్యాఖ్యలు చేశారు, సీబీఐ రాష్ట్రంలోకి రావద్దంటూ.. తీర్మానాలు కూడా చేశారు. అలాంటి సీబీఐ మీద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు అపారమైన విశ్వాసం, భక్తి కలుగుతోంది. ప్రతి విషయంలోనూ సీబీఐ ఎంక్వాయిరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న రథం దగ్థం అయిన సందర్భంలోనూ సీబీఐ విచారణ జరిపించమని అడిగారు. దీనిపై ప్రభుత్వం కూడా సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీనిని చాలామంది స్వాగతించారు, కానీ చంద్రబాబు స్వాగతించినట్లు ఎక్కడా కనిపించలేదు.“ అంటూ చంద్రబాబు నాయుడును ఎత్తిపొడిశారు.
వైసీపీ ఏం చేస్తోంది?
వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలపై సీబీఐ విచారణ వేస్తున్నామని అంబటి రాంబాబు తమ పార్టీ, ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. అలాగే గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో జరిగిన అనేక అవకతవకల మీద, కుంభకోణాల మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రాన్ని కోరితే.. చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు, దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదు. అంటూ ప్రశ్నించారు. భారతదేశంలోనే అమరావతి అతి పెద్ద కుంభకోణం.. ఇందులో దేశంలోనే పెద్దలుగా చెలామణి అయ్యే చాలా మంది ఉన్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.