ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టుల రూపంలో తీవ్ర అసంతృప్తి ఎదురవుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని విషయంలో ఈ నిరాశ తప్పడం లేదంటున్నారు.
మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా బిల్లులపై హైకోర్డు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అయితే అక్కడా సర్కారు సమన్వయ లోపంతో షాక్ ఎదురైంది.
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాసింది. అయితే, పిటిషన్లో తప్పుల తడకలు ఉండటంతో విచారణకు రాలేదని సమాచారం. పలు తప్పులు ఈ పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారని, ఉత్తర్వులను పిటిషన్కు జత చేయలేదని సమాచారం. మరోవైపు తప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా సమాచారం.
ఇదిలాఉండగా, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖలో ఈనెల 16 వ తేదీన మొదట శంకుస్థాపన చేయాలని భావించినా… ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీనికి కారణం కోర్టు కేసులు, వివిధ రకాల అనుమతులు రాకపోవడం అని తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండటం, వివిధ అంశాల్లో కొనసాగుతున్న అస్పష్టత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టులో స్టే ఆశలు సన్నగిల్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.