గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో జిల్లాల ఏర్పాటు ఒకటి. దీనిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జగన్ సర్కారు కసరత్తు ప్రారంభించింది.
ఫలితంగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడతాయని ఇప్పటికే ఒక అంచనా ఉంది. దీనివల్ల టీడీపీ ఓటు బ్యాంకు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు తమ్ముళ్లలో కలుగుతున్నాయి. మరోపక్క, టీడీపీలో సెంటిమెంట్గా వస్తున్న ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరును కూడా ఇప్పుడు జగన్ వాడుకునేందుకు రెడీ అవుతున్నారు. కృష్ణాజిల్లాను రెండుగా విభజిస్తే.. మచిలీపట్నం పార్లమెంటు స్థానంతో ఏర్పాటు చేసే జిల్లాకు గుడివాడ కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉంది.ఇదే జరిగితే.. ఎన్టీఆర్ను అభిమానిస్తున్న వారితోపాటు నందమూరి కుటుంబం కూడా జగన్కు పరోక్షంగా అభిమానులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల ఈ విషయంపై స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేస్తే.. తాను స్వాగతిస్తానని ప్రకటించారు.
ఇక, నందమూరి కుటుంబంలోని మిగిలిన వారు కూడా దీనిని స్వాగతించే అవకాశం ఉంది. ఇప్పటికే గుడివాడ, నూజివీడు, గన్నవరం, పామర్రు సహా విజయవాడలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇక, ఈ ఎన్టీఆర్ సెంటిమెంట్ను జగన్ తన ఖాతాలో వేసుకుంటే.. మొత్తంగా టి.డి.పి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలోకి పడే ప్రమాదం ఉందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ సెంటిమెంట్ దాడి నుంచి ఎలా బయట పడతారో చూడాలి.మొత్తం మీద సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది.