ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో గానీ అన్నీ ఆయనకి అడ్డంకులే ఎదురవుతున్నాయి.
ఏదో విధంగా సాంకేతిక కారణాలు చూపి శాసనమండలి తిరస్కరించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న జగన్ సంతోషం అంతలోనే ఆవిరయిపోయింది. ఆ విషయం కోర్టుకెళ్లింది.మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో యాభైకి మించి పడిన పిటిషన్లు పెద్ద ఎత్తున బ్రేకులేస్తున్నాయి. వరస స్టేలతో ఇపుడు హైకోర్టులో మూడు రాజధానుల చట్టం ఇరుక్కుపోయినట్లైంది. విచారణ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు పెద్ద సంఖ్యలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పిటిషన్లు ఉన్నాయి. అన్నీ కలిపి విచారించినా కూడా చాలా సమయమే పట్టేట్లు ఉంది.
మరో వైపు సుప్రీంకోర్టు అయితే మూడు రాజధానుల చట్టం అమలు చేసేందుకు వీలుగా హైకోర్టు విధించిన స్టేను తొలగించలేమని చెప్పేసింది. ఇక హైకోర్టు తీర్పు కోసమే జగన్ సర్కార్ ఎదురు చూడాలి .అయితే ఇదంతా ఊహించని జగన్ ప్రభుత్వం విశాఖపట్నం కి రాజధాని తరలింపునకు విజయదశమి రోజున అంటే అక్టోబర్ 25వ తేదీన ముహూర్తం కూడా పెట్టుకుందంట. విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామీజీ ఈ మహత్తరమైన ముహూర్తం పెట్టారని కూడా చెబుతారు. ఇప్పటికి నుంచి చూస్తే విజయదశమికి ఎక్కువ దూరం లేదు. కానీ హైకోర్టులో విచారణ సెప్టెంబర్ 21 తరువాత మొదలవుతుందని అంటున్నారు. అక్కడ ఎంత త్వరగా విచారణ జరిపినా అక్టోబర్ విజయదశమి ముహూర్తం కూడా దాటిపోయేలా ఉంది. దాంతోనే వైసీపీలో మధనం మొదలైందని అంటున్నారు.
ఇపుడు న్యాయపరమైన చిక్కులు ఉండడంతో 2020 లో విశాఖకి రాజధానికి జగన్ వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదన్న విశ్లేషణలు ఉన్నాయి.ఇక 2021లో చూసుకుంటే ఒకవేళ హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమరావతి రాజధాని జేఏసీ సుప్రీం కోర్టు తలుపు తట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి అక్కడ ఈ కేసు ఎన్నాళ్ళు పడుతుందో దేవుడికే ఎరుక. అంటే మొత్తానికి జగన్ మూడు రాజధానుల ముచ్చట ఇప్పట్లో తీరేది కాదని కచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు.ముఖ్యమంత్రి జగన్ కి ఇది బాగా నిరాశ కలిగించే ముచ్చటే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.