భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత 14వ ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హజరైయ్యారు. తాజా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తాజా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా విచ్చేశారు.
ఈ నెల 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగిన జగదీప్ ధన్ కర్ విపక్షాల అభ్యర్ధి మార్గరేట్ అల్వాపై విజయం సాధించారు. ధన్ కడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుండి జరిగిన చివరి ఆరు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ధన్ కడ్ కు ఎన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. వీటిలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఏపి సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సహా పలు పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్ కు దూరంగా ఉంది.
ధన్ కడ్ 1989లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991లో పీవీ నరసింహరావు హయాంలో మంత్రిగా పని చేశారు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా పని చేసిన ధన్ కడ్ అంతకు ముందు రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.
కాగా ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పటేల్ చేత కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ లకు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేశారు.
ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి .. ముగ్గురు జవాన్లు వీర మరణం