జగ్గారెడ్డి…అసలు పేరు కంటే ఈ పేరుతోనే ఆయన పాపులర్. అసలు పేరు…తూర్పు జయప్రకాశ్ రెడ్డి. సంగారెడ్డి ఎమ్మెల్యే. తెలంగాణ రాజకీయాల్లో పైర్బ్రాండ్ నేతగా సుపరిచితుడు.
కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నప్పటికీ, అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దల భజన కార్యక్రమంలో మునిగిపోయారు. ఒక్క ఆర్టీసీ సమ్మె అంశం మినహాయిస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికి ఎత్తేశారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ సర్దిచెప్పుకొచ్చారు. ఆఖరికి చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇలా సంచలన పరిణామాలతో వార్తల్లో నిలిచిన ఆయన మళ్లీ అదే రీతిలో వ్యవహరించారు.
ఇదేం ట్విస్ట్ జగ్గారెడ్డి గారు?
సెప్టెంబర్ 2న కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ ఇస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోరతానన్నారు జగ్గారెడ్డి. లేకపోతే, తన కూతురితో కలిసి అదే రోజు ప్రగతి భవన్ ముందు కూర్చుంటానని జగ్గారెడ్డి హెచ్చరించారు.
వాళ్లే జగ్గారెడ్డికి షాకిచ్చారా?
ఇటీవల జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలకే షాకిచ్చిన సంగతి తెలిసిందే. మిగతా నాయకుల విషయంలో ఎలా ఉన్నా… పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమారెడ్డిని మాత్రం ఆయన అవకాశం వచ్చినపుడు సమర్థించేవారు, పొగిడేవారు. తాజాగా ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో షాక్ తగిలింది. అది కూడా ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలోనే కావడం గమనార్హం. ఇటీవల కన్నుమూసిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి ప్రకటించేశారు. అయితే, ఈ విషయంలో జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. దుబ్బాక బై పోల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవరు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగతమన్న ఉత్తమ్… మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అవాక్కవడం జగ్గారెడ్డి వంతు అయింది.
ముఖ్యమంత్రికి లేఖ…ఇంటి రాజకీయంపై ట్విస్ట్
సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే… ప్రగతిభవన్ గేటు ఎదుటే నిరాహార దీక్షకు దిగుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే, అందులో తన కూతురి గురించి ప్రస్తావించడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో జగ్గారెడ్డి కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనే అనుమానం విలేకరులు వ్యక్తం చేయగా ఎన్నికల్లో తన కూతురు పోటీపై నిర్ణయం తీసుకోలేదని జగ్గారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆందోళన అంతా ప్రజా సమస్యలపైనే ఉందన్నారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులెవరన్నది తేల్చే పనిలో ఉన్నామని జగ్గారెడ్డి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.