జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి కన్నీళ్లపర్యంతం అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తనను సంజయ్ కుమార్ అడుగడుగునా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త అంటూ సంజయ్ బెదిరించారనీ, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు శ్రావణి. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని, దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులకు అడ్డుతగిలారనీ,, మున్సిపల్ చైర్ పర్సన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని పేర్కొన్నారు.
నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని, ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రావణి. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్లానని చెప్పారు. చెప్పకుండా వార్డు సందర్శనకు వెళ్లినా ఆయన దృష్టిలో నేరమేనని, ఒక్క పని కూడా తన చేతులతో ప్రారంభించకుండా చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ను కలవద్దని అదేశించారన్నారు. అనుకూలంగా ఉన్న కొద్ది మంది కౌన్సిలర్ లను కూడా ఇబ్బంది పెట్టారని, అందరి ముందు అవమానించే వారని అన్నారు. బీసీ మహిళననే తనపై కక్షకట్టారనీ, సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా అని ప్రశ్నించారు.
పేరుకు తాను చైర్ పర్సన్ అయినా పెత్తనం మొత్తం ఎమ్మెల్యేదేనని, తనకు మాట్లాడే స్వేచ్చకూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలనీ, కవితను కూడా కలవకూడదని చెప్పారన్నారు. కేటిఆర్ పేరు ప్రస్తావించకూడదని హుకుం జారీ చేశారని అన్నారు. ఆశీర్వదించేందుకు కవిత ఇంటికి వస్తే వేధింపులు ప్రారంభమైయ్యాయన్నారు. ఎమ్మెల్యేతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నానని శ్రావణి తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పై అదే పార్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధి తీవ్ర ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. చైర్ పర్సన్ శ్రావణి ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు