ఇస్లామాబాద్, మార్చి 4 : ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ చనిపోయాడంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో అతను బతికే ఉన్నాడని పాక్ మీడియా వెల్లడించింది.
ఈ విషయాన్ని అతని కుటుంబ సన్నిహితులు తెలిపినట్లు జియో ఉర్దూ మీడియా సంస్థ పేర్కొన్నది. మసూద్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం జియో ఉర్దూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఆదివారం మసూద్ అజహర్ మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. మృతిపై భిన్న కథనాలు వెలువడ్డాయి.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మసూద్ మరణించాడని ఒక కథనం వెలువడింది.
అలాగే గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్లోని బాలాకోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో మసూద్ మరణించాడని మరో కథనం వెలువడింది.
మసూద్ చనిపోయాడా.. బతికే ఉన్నాడా అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకూ పాకిస్థాన్ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.
మసూద్ మరణించాడంటూ మీడియాలో వస్తున్న కథనాలపై పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధరిని పీటీఐ వార్తా సంస్థ వివరణ కోరగా.. ప్రస్తుతం ఆ విషయం గురించి తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు.
గత కొంతకాలంగా అజహర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారనీ, కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ప్రకటించిన విషయం తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?