ప్రకృతి అందాలకు నెలవైన జమ్ము కాశ్మీర్ అందాలను ఆస్వాదించడమే కాదు.అక్కడే భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. తాజా ఉత్తరువ్వుల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలలో ఈ దేశ ప్రజలు ఎవరు అయినా భూమినీ కొనుకోవచ్చు అలాగే ఎవరికైనా అమ్మవచ్చు అని కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జమ్ముకశ్మీర్లోని పలు చట్టాలను సవరణలు చేసి మరీ ఈ మార్పు తీసుకొచ్చింది. గతంలో ఆర్టికల్ 370 ఉన్న సమయంలో కేవలం జమ్మూ కాశ్మీర్కు చెందిన వారు తప్ప దేశంలోని ఇతర ఏ ప్రాంతానికి చెందిన వారికైనా సరే అక్కడ భూములను కొనేందుకు, ఇళ్లను నిర్మించుకునేందుకు అవకాశం లేదు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు దేశ ప్రజలు ఎవరైనా జమ్ముకశ్మీర్లో భూములను కొనవచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యసాయేతరులకు అమ్మడానికి మాత్రం వీల్లేదు. కాకపోతే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వ్యవసాయ భూముల్ని కాంట్రాక్టు ఫార్మింగ్ కోసం వినియోగించవచ్చు.
‘హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఇతర రాష్ట్రాల వాళ్లు తమకు ఇష్టమొచ్చినంత భూమిని కొనే అవకాశం లేదు. ఇదే మాదిరిగా జమ్మూకాశ్మీర్లో సీలింగ్(లిమిట్) పెట్టాలని, స్థానికుల హక్కులను (ముఖ్యంగా భూములు, ఉద్యోగాలకు సంబంధించినవి) కాపాడటానికి డొమిసైల్ బేస్డ్ పాలసీని అమలుచేయాలని లోకల్ బీజేపీ లీడర్లు తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కాశ్మీర్లోని కాశ్మీరీల, వాల్మీకీల, గుజ్రాల, బకర్వాలాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో లోకల్ పబ్లిక్ని అనవసరంగా భయాందోళనలకు గురిచేసే ప్రచారాన్ని ఇప్పటికైనా కట్టడి చేయాలి’ అని నిర్మల్ సింగ్,మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని పార్టీలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రంపై మండిపడుతున్నాయి. సెక్షన్ 17లోని హక్కును తొలగించడంపై పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా దీనిని తప్పుపట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇప్పుడు జమ్ముకశ్మీర్ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని, దీని వల్ల అక్కడి పేదలకు నష్టం కలుగుతుందని మెహబూబా వ్యాఖ్యానించారు.