Jana Reddy: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎలక్షన్ ఫలితాలపై స్పందించారు. సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలతోపాటు తన అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా తనను ఆశీర్వదించిన నియోజకర్గ ప్రజలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజకీయ వారసులు ఎవరనేది పార్టీయే ప్రకటిస్తుందన్నారు.
పార్టీలో కొందరు స్వప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. ‘జానారెడ్డి అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఏడేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలి. లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో, సాగర్లో ఏమేం చేశారో చెప్పాలి. నాకు 75 ఏళ్ల వయసు వచ్చింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను. పీసీసీ ఎంపికను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఆ విషయంలో నా అభిప్రాయాన్ని పార్టీకి చెబుతా. కరోనా టైంలో కార్యకర్తలను కలవలేకపోతున్నా. కార్యకర్తలను నా వారసులుగా తయారు చేస్తా. ఓటమి బాధ, భయం గానీ అవసరం లేదు. కరోనా పోయాక అందర్నీ కలుస్తా. గెలుపు ఓటములు సహజం. రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ప్రభుత్వానికి నా అవసరం ఉంటే సలహా సూచనలు ఇస్తా. మా పార్టీకి అవసరం ఉంటే సలహాలు, సూచనలు ఇస్తా’ అని జానారెడ్డి పేర్కొన్నారు.
ప్రతి వాగ్దానం నెరవేరుస్తానన్న కేసీఆర్!
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తో వచ్చి నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.