అమరావతి: సమాజంలో, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ పార్టీ స్థాపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురయ్యింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా రావడంతో గౌరవప్రదంగానైనా సీట్లు వస్తాయని భావించారు. వామపక్షాలు, బిఎస్పితో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత మేర ఓటు బ్యాంకు వస్తుందనీ జనసేన భావించినప్పటికీ ఫలితం కనబడలేదు. విద్యావంతులు, పదవీ విరమణ చేసిన అధికారులను ఎన్నికల రంగంలోకి దింపినప్పటికీ ఓట్లు రాబట్టలేకపోయారు. ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గమైన రాజోలు నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే జనసేన పార్టీ నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ పరాజితులు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.