అమరావతి: రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు బకాయిలను తక్షణం ప్రభుత్వం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. నేడు దీనిపై ప్రకటన విడుదల చేశారు.
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి సొమ్ములు చెల్లించకుండా జాప్యం చేయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. తొలకరి సమయంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. బకాయిలు చెల్లించకుండా, రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పార్టీ నాయకుల ద్వారా రైతు ప్రతినిధులు ధాన్యం కొనుగోలు బకాయిలు, విత్తనాల సమస్యను తనకు వివరించారని ఆయన తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను తక్షణం విడుదల చేసి విత్తనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు.
నేటి వరకూ రైతులకు 610.86కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 240కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 176 కోట్ల రూపాయలు, కృష్ణాజిల్లాలో 94కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఖరీఫ్ పనులు మొదలైన తరుణంలో ధాన్యం అమ్మినా సొమ్ము రాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారిందని పవన్ అన్నారు.
ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతులు విత్తనాల కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కోసం అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడ్డా దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి ఉండటంతో రైతాంగం బాధపడుతోందని పవన్ అన్నారు.
అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 4.96లక్షల హెక్టార్లలో వేరుశనగ వేస్తారనీ, ఇందుకు మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారని పవన్ చెప్పారు. కానీ 1.8లక్షల క్వింటాళ్లు విత్తనమే వచ్చిందనీ చెబుతున్నారని పవన్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే విత్తనాలను రైతులు బయట అమ్ముకుంటున్నారని అలా చేస్తే ప్రభుత్వ లబ్దిరాదు అంటూ అధికారులు హెచ్చరించడం సరికాదని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవనీ, ప్రభుత్వం వెంటనే పరిస్థితిపై సమీక్షించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.