అమరావతి: ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాల నుండే పన్నులు వసూలు చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 27ని ఉల్లంఘిస్తోందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగరాజన్ చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.
సెక్యులర్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాలకు వచ్చే ఆదాయం నుంచి ప్రతి ఏడాది 23.5 శాతం పన్ను రూపేణా వసూలు చేస్తున్నాయని రంగరాజన్ పేర్కొన్నారు. దేవాదాయ పరిపాలన పన్ను రూపంలో 15 శాతం, ఆడిట్ ఫీజు రూపేణా రెండు శాతం, కామన్ గుడ్ ఫండ్ నిమిత్తం రెండు శాతం, అర్చక సంక్షేమ నిధి, ఇతర పన్నుల రూపంలో దేవాలయాల ఆదాయంలో నాలుగో వంతు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయన్నారు. ఇదంతా కేవలం దేవాలయాలకే వర్తిస్తోంది. ఒక్క చర్చి కానీ, ఒక్క మసీదు కానీ రూపాయి కూడా పన్ను చెల్లించడంలేదని ఆయన వెల్లడించారు.
ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని భారత రాజ్యాంగంలోని 17వ అధికరణం చెబుతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
‘చర్చిలు, మసీదులను వదిలేసి దేవాలయాల నుంచే ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారు ? ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వండి’ అంటూ రంగరాజన్ వీడియోలో పేర్కొన్న అంశాలను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
https://twitter.com/PawanKalyan/status/1198555417183342592
https://twitter.com/PawanKalyan/status/1198553760433225728