తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గిపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాట కాకపోవడంతో వచ్చిన ఎలక్షన్ ఫలితాలను బట్టి పార్టీ ఓట్ బ్యాంక్ చాలావరకు పోయిందన్న టాక్ రావటం జరిగింది. ఇదే క్రమంలో చాలామంది టీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు తెలంగాణ రాజకీయవర్గాలలో మొదలయ్యాయి.
ఇలాంటి తరుణంలో ఇప్పటికే విజయశాంతి పార్టీ మారగా మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా టీ కాంగ్రెసులో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి నాగార్జున ఉపఎన్నిక గురించి సంచలన కామెంట్ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో పోటీ చేయను అని చెప్పుకొచ్చారు. తన బదులు ఈ ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తాడు అని జానారెడ్డి తెలిపారు. రెండేళ్ల కోసం పోటీ చేయటం వల్ల లాభం ఏముంటుంది అని అంటున్నారు.
అసలు ఎన్నికలలో పోటీ చేయను అని గతంలోనే చెప్పాను, ఈ క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా నిర్ణయం మారదు అని జానారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారాల్సిన కర్మ తనకు పట్టలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే పీసీసీ పదవి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. పార్టీ మారుతున్నట్లు మీడియా సృష్టిస్తున్న వార్త తప్పా తనకు అలాంటి ఉద్దేశం లేదని జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు.