TDP Janasena: రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. వరుస పరాజయాలతో టీడీపీ (TDP ) కూదేలు అయ్యింది. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ ఇంత దయనీయ పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రుల హయాంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నా ఈ పరిస్థితులను చవి చూడలేదు. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన దైన స్టైల్ లో రాజకీయాన్ని నెరపడంతో స్థానిక, జిల్లా పరిషత్ పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాలను సాధించింది. టీడీపీ బొక్క బోర్లా పడింది. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ టీడీపీ చేస్తున్న ఆరోపణలను పక్కన పెడితే అధికార వైసీపీని అడ్డుకోలేకపోవడం టీడీపీ అసమర్ధత కిందే లెక్క కడుతున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనాలంటే మళ్లీ జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ భావిస్తోంది. వివిధ రకాల సర్వేలు కూడా టీడీపీ, వైసీపీ, జనసేన వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, టీడీపీ, జనసేన ( Janasena ) కలిసి పోటీ చేస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని వెల్లడిస్తున్నాయి. దీంతో జనసేనతో స్నేహ హస్తం కోసం టీడీపీ ప్రయత్నాలు ప్రారంభిస్తుందని సమాచారం.
TDP Janasena: సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే..?
అయితే జనసేన పార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబుతో కలిసేందుకు అంత సుముఖత వ్యక్తం చేయడం లేదని టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన సహకరిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జనసేన పై శీతకన్ను వేసిందని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలతో తప్పుడు ప్రచారాలను చేయించిందని ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే జనసేనతో భాగస్వామ్యంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీ.. తమ కూటమి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ అంటూ ప్రకటన చేసిన దరిమిళా టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే టీడీపీతో కలిసి పోటీ చేయడానికి తాము అంగీకరిస్తామని జనసైనికులు పేర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఆ ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ జనసైనికులు, పవన్ అభిమానులు మాత్రం రాష్ట్రంలో ఆ రెండు సామాజిక వర్గాలేనా పరిపాలించేది, 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి సహకరించినందున ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారుట.
జనసేనతో పొత్తుకు టీడీపీ తహతహ
వాస్తవానికి రాష్ట్రంలో జనసేన పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. దీన్ని టీడీపీ అడ్వంజేట్ గా తీసుకుని జనసేనకు 30 – 40 అసెంబ్లీ స్థానాలు పొత్తులో ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ దోస్తాన్ ను కటీఫ్ చెప్పాలన్న ఆలోచన కూడా జనసేన చేస్తుందట. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు చేస్తామని చెప్పిన జనసేన, బీజేపీలు ఇప్పటి వరకూ కలిసి పోటారాలు చేసిన సందర్భాలు లేవు. కేంద్రంలోని బీజేపీతో పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తున్న దాఖలాలు లేవు. అందుకే బీజేపీ నుండి దూరంగా జరిగి టీడీపీతో కలిసి పోటీ చేయాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్న ఆలోచనలో జనసేన ఉంది. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల అది వైసీపీకే లాభం కల్గిస్తుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకే జనసేనతో పొత్తుకు టీడీపీ తహతహ లాడుతోందని సమాచారం. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలోనూ జనసేనకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని కూడా హామీ ఇస్తోందట. అయితే జనసేన కొత్త ప్రతిపాదన తీసుకురావడంతో టీడీపీ డైలమాలో పడిపోయిందని అంటున్నారు. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?