పవన్ కి ఏమైంది… నాడు ఉన్న వేడి నేడెక్కడ… ఆ వేడి, ఉత్సాహం చూసే కదా అన్నవెనక అంతెత్తున ఎగురుకుంటూ వెళ్లింది. పవన్ లో ప్రశ్నించే గుణం అయిపోయిందా… నాడు చెప్పిన మాటలు, చేసిన ప్రసంగాలు, వినిపించిన కవితలు అన్నీ పాలపొంగులేనా అని ఫీలవుతున్నారంట జనసైనికులు! దానికి.. కారోనా వచ్చినప్పటినుంచీ కనుమరుగైపోయిన పవన్ వ్యవహరమే కారణం అంట!
ఇప్పటికే మెగా ఫ్యామిలీని ఎంతగానో ప్రేమించి.. కాదు కాదు ఆరాధించిన అభిమానులు, నాడు ప్రజారాజ్యం అంటూ అన్నయ్య వస్తే.. అన్నీ వదులుకుని రంగంలోకి దిగారు! నాడు ప్రజారాజ్యం ఫస్ట్ మీటింగ్.. ఒక చరిత్ర. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే… అనతికాలంలోనే ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయింది.. కనుమరుగైపోయింది! ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మెగా ఫ్యాన్స్ కి, ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా సమయమే పట్టింది. అనంతరం “ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢ అంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపంలోదు.. కాని గుండెల నిండా ధైర్యం ఉంది. వెనకడుగు వేసేది లేదు..” అంటూ తమ్ముడు వచ్చాడు.. జనం మళ్లీ నమ్మారు. అభిమానించేవారైతే ఆలోచించేవారేమో… ఆరాధించేవారు కావడంతో మళ్లీ రంగంలోకి దిగారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో సీటు ఒకటే వచ్చినా.. ఓట్లు 6% వచ్చాయి.
ఈ క్రమంలో పవన్ కొంతకాలంగా కనిపించడం లేదని… ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్న వ్యక్తికి.. నేడు ఏపీలో ప్రశ్నించడానికి ఏ సమస్యా కనిపించడం లేదా అని జనసైనికులు ఫీలవుతున్నారంట. ప్రజలతరుపున స్పందించని రాజకీయాలేమి రాజకీయాలు అని ఫైరవుతున్నారంట. ఈ క్రమంలో ఇంతకాలం ఓపిక ఉన్నవారిలో కొంతమంది.. పక్కపార్టీలవైపు జారిపోతున్నారని అంటున్నారు. అధినేత కాడి దింపేసే లోపు వారే కాడివిడిచేసే పనికి పూనుకుంటున్నారని అంటున్నారు!! జనసేన వచ్చి ప్రజారాజ్యం చేదు జ్ఞాపకాన్ని చెరిపేస్తాది అని భావిస్తే… ఆ గాయాన్ని మళ్లీ గుర్తుచేస్తూ, రేపుతుందని అంటున్నారట.
ఈ పరిస్థితుల్లో జనసేనాని ప్రజల్లోకి రావాలని, లేదా.. బీజేపీలో విలీనం అంటూ వస్తున్న వార్తలపై అయినా క్లారిటీ ఇచ్చి.. తమను కాస్త టెన్షన్ విముక్తులను చేయాలని కోరుకుంటున్నారంట. జనసేన ఒంటరిగా పోరాడలేదు.. బీజేపీ కలుస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.. “బీజేపీతో కలిసి పనిచేస్తాదా లేక బీజేపీలో కలిసిపోయి పనిచేస్తాదా” అనే కంఫ్యూజన్ నుంచి కార్యకర్తలు క్లారిటీ అడుగుతున్నారు… పవన్ ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నారు!!