అమరావతి, ఏప్రిల్ 24: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తరువాత 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని పవన్ అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పవన్ పేర్కొన్నారు.
పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యూయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతిదశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయనీ, వాటిని నివృత్తి చేసి నిజాలు వెల్లడించాలని పవన్ డిమాండ్ చేశారు. సందేహాలను వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఇంటర్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలని పవన్ కోరారు.
జీవితం చాలా విలువైనది, ఈ ఫలితాలకు నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్వేర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.