(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
బీజెపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు నడ్డాతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాల అంశాలపై చర్చించారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరంపై స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, అలయాలపై దాడులు తదితర విషయాలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన – బీజెపీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా పవన్ పునరుద్ఘాటించారు.
తిరుపతి ఉప ఎన్నికలకు అభ్యర్థి ఎంపిక త్వరలో నిర్ణయిస్తామన్నారు. జనసేన, బీజేపీ ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని పవన్ చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలో నిర్ణయం జరుగుతుందని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజెపీ పెద్దలను కలవడానికి వెళ్లడంతో రాష్ట్రంలో వివరీతమైన ఊహగానాలు, జనసేన, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మధ్య ట్రోల్స్ జరిగాయి. పవన్కు బీజెపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనీ, పవన్ పడిగాపులు పడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ట్రోల్స్ చేయగా గతంలో సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి ఎవరినీ కలవకుండా వచ్చారంటూ జనసేన నేతలు ప్రతిగా ట్రోల్స్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీ బరి నుండి తప్పుకుని బీజెపీకి మద్దతు ఇచ్చినందున తిరుపతి పార్లమెంట్ సీటును జనసేనకు ఇవ్వాలని అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్తో పాటు నడ్డాను కలిసిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజెపి, జనసేన కలిసి అధికారంలోకి ఎలా రావాలన్న అంశంపై చర్చించామని తెలిపారు.