ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ గెస్ట్ గౌస్ లో రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం పలు ప్రాజెక్టుల శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పీఎంఓ నుండి సమాచారం అందినట్లు తెలుస్తొంది. శుక్రవారం సాయంత్రం నుండి విశాఖలో అందుబాటులో ఉండాలని పవన్ కు పీఎంఒ నుండి సమాచారం అందింది.
శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారని సమాచారం. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధాని మోడీతో పవన్ భేటీ కానుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై పవన్ తో మోడీ చర్చించే అవకాశం ఉందని సమాచారం. పీఎం మోడీ అపాయింట్మెంట్ ఖరారు అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో విశాఖ కు చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు విశాఖలో ఉంటారని జనసేన వర్గాలు తెలిపాయి. అయితే ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ హజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హజరు అవుతారా లేదా అన్న వివరాలు తెలియరాలేదు. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.