అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను వేయించుకున్నారని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ ఫొటోను కొందరు వదిలారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్ కు కూడా ట్యాగ్ చేశారు. ఈ మార్ఫింగ్ ఫొటోపై జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.